దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి ముప్పు? .. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో బీజేపీ సవాల్

  • తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశం
  • ఇటీవల దానం సహా అందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్
  • స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరిన ఏలేటి
  • పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టే అవకాశం

తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల పర్వం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని తన పిటిషన్ లో ఆయన కోర్టును కోరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని ఏలేటి తన పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడం పక్కాగా ఫిరాయింపు కిందికే వస్తుందని ఆయన పేర్కొన్నారు.


నామినేషన్ పత్రాలనే ఆధారంగా తీసుకుని దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని ఏలేటి డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పార్టీ మారినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పొందుతున్న జీతభత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరైన నేపథ్యంలో, దానం నాగేందర్ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తును కూడా శాసించే అవకాశం ఉంది. 


Danam Nagender
Telangana Politics
Aleleti Maheshwar Reddy
Telangana High Court
Khairatabad MLA
BJP
Congress
Defection
Speaker
Secunderabad MP

More Telugu News